లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి.. సర్పంచ్ భర్త అరెస్ట్
గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూ.10 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. కొమురవెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్లాట్లో గ్రామ పంచాయతీ అధికారులు డ్రైనేజీ పైప్లైన్ ఏర్పాటు చేశారు. ఆ పైప్లైన్ను తొలగించేందుకు అధికారిక అనుమతి ఇవ్వాలంటే రూ.10 వేల లంచం ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన అధికారులు సోమవారం సాయంత్రం 4:40 గంటల సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో దాడి నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి సూచనల మేరకు సర్పంచ్ పద్మ భర్త గొల్లపల్లి అంజనేయులు లంచం నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10 వేల లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వ కార్యాలయంలోనే లంచం వ్యవహారం బయటపడటంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.