లోకేశ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే, జగన్ కొత్త కట్టుకథలు : ప్రత్తిపాటి
తనవల్ల కాని అసాధ్యాలను లోకేశ్ ఆచరణ సాధ్యం చేయడాన్ని జగన్ భరించలేకపోతున్నాడు : ప్రత్తిపాటి
• ఈర్ష్య అసూయతోనే డీఎస్సీలో అక్రమాలంటూ గగ్గోలు పెడుతున్నాడు. : ప్రత్తిపాటి
• డీఎస్సీలో అక్రమాలు జరిగినట్టు జగన్ కు కలవచ్చిందా..ఆత్మలు చెప్పాయా? : ప్రత్తిపాటి
• ఏ ఆధారాలతో జగన్.. వైసీపీనేతలు డీఎస్పీపై ఆరోపణలు చేస్తున్నారు? : ప్రత్తిపాటి
• అబద్ధాలు..అడ్డగోలు విమర్శలతో పరపతి పెంచుకోవాలన్నదే జగన్ ప్రయత్నం : ప్రత్తిపాటి
• 33 శాతం రిజర్వేషన్లు, తరిగిపోని మహిళాభిమానంతో లోకేశ్ తిరుగులేని నాయకుడు అవుతాడు : ప్రత్తిపాటి
“కూటమిప్రభుత్వంలో, టీడీపీలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న మంత్రి నారా లోకేశ్ ను రాజకీయంగా ఎదుర్కోవడం అసాధ్యమని తెలిసే.. జగన్, వైసీపీనేతలు డీఎస్సీలో అక్రమాలంటూ కొత్త కట్టుకథలు మొదలుపెట్టారు. జగన్ ఐదేళ్లలో సాధించలేని నిరుద్యోగుల దశాబ్దాల కలను, లోకేశ్ కేవలం 150 రోజుల్లో నిజం చేశారు. 16,347 పోస్టుల భర్తీతో ఉద్యోగాలు పొందిన వారి కుటుంబాల్లో శాశ్వత వెలుగులు నింపారు. తనవల్ల కాని ఇలాంటి అసాధ్యాలను లోకేశ్ ఆచరణ సాధ్యం చేస్తూ, ప్రజల మనసులు గెలుస్తున్నాడన్న అక్కసు, భరించలేని ఈర్ష్య, అసూయతోనే జగన్ డీఎస్సీలో అక్రమాలంటూ గగ్లోలు పెడుతున్నాడు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగినట్టు జగన్ కు పగటి కల వచ్చిందా? లేక ఆయనకు మాత్రమే కనిపించే ఆత్మలేమైనా చెప్పాయా? డీఎస్సీకి సన్నద్ధులై, మోసపోయిన అభ్యర్థులెవరైనా ఆయన్ని కలిసి తగిన సాక్ష్యాధారాలిచ్చి, తమకు అన్యాయం జరిగిందని చెప్పారా? ఏ ఆధారాలతో జగన్.. వైసీపీ నేతలు డీఎస్సీలో అక్రమాలని విషప్రచారం చేస్తున్నారు? వారివద్ద ప్రభుత్వం తప్పుచేసినట్టు సరైన ఆధారాలుంటే, న్యాయస్థానాలను ఆశ్రయించైనా నిరుద్యోగులకు న్యాయం చేయవచ్చు కదా! జగన్ విధానం మొదటినుంచీ అదే. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ లపై బురదజల్లడం.. తప్పించుకు తిరగడం. అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై మాట్లాడే ధైర్యం లేని జగన్.. అబద్ధాలు, అసత్యాలతో అడ్డగోలు విమర్శలతో ప్రజల్లో పరపతి పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.
33 శాతం రిజర్వేషన్ల నిర్ణయంతో లోకేశ్ ‘రియల్ హీరో’ అయ్యాడు
కేంద్రప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలుచేసినా, చేయకపోయినా పార్టీలో, పదవుల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామన్న మంత్రి లోకేశ్ నిర్ణయంపై నారీమణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మహానాడు వేదికపై ప్రకటించిన అనూహ్య నిర్ణయంతో లోకేశ్ మహిళల రియల్ హీరో అయ్యాడు. వెలకట్టలేని, ఎప్పటికీ తరిగిపోని మహిళాభిమానంతో ఆయన తిరుగులేని భావినాయకుడు కానున్నారు. మగువల మనసెరిగి, వారి ప్రేమాభిమానాలు పొందేలా వ్యవహరిస్తున్న లోకేశ్ ఆలోచనావిధానంతో పోలిస్తే.. ఆస్తికోసం తల్లిని, చెల్లిని గెంటేసిన జగన్ ఎందుకు పనికొస్తాడంటూ అక్కచెల్లెళ్లు వైసీపీ అధినేతపై దుమ్మెత్తిపోస్తున్నారు. నా అక్కచెల్లెళ్లు అంటూ నమ్మించి నట్టేటముంచాడని శాపనార్థాలు పెడుతున్నారు.” అని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.