మా పాలనలో అభివృద్ధి.. ఇప్పుడు దోపిడీ: గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు
రాయచోటి, జూలై 11: తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చామని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 20 వేల పక్కా గృహాలు నిర్మించి పేదలకు అందించామని, సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె వద్ద పట్టణ పేదల కోసం 6 వేల ఇళ్ల కాలనీ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, స్టేడియం నిర్మాణంతో పాటు ప్రభుత్వ భూములను రక్షించి, శిల్పారామం పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లా కేంద్రం ఏర్పాటు, రూ.7 వేల కోట్లతో వాటర్ గ్రిడ్, రూ.4 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం తమ ప్రభుత్వ ఘనతేనని అన్నారు. ప్రజల సంపదను కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రస్తుతం మాత్రం ప్రజా సంపద దోపిడీకి గురవుతోందని ఆరోపించారు. దౌర్జన్యాలు, రాజకీయ డైవర్షన్లు మానుకుని బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వ్యవస్థలు ఎవరి సొంతం కావని, వీఆర్వో నుంచి కలెక్టర్ వరకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు సహకరించినా చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందేనని గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.