మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ
ఆగిరిపల్లి, మార్చి 25:
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప ఉన్నత ఆశయాలు కలిగిన నాయకుడని కొనియాడారు.
దేశంలో సుమారు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా సేవలందించిన జగ్జీవన్ రామ్ వ్యవసాయ, కార్మిక, రక్షణ శాఖల్లో కీలక పాత్ర పోషించి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేసిన గొప్ప నాయకుడని గుర్తుచేశారు.
అంటరానితనం, అస్పృశ్యతను ఎదుర్కొంటూ ఉన్నత చదువులు పూర్తి చేసి ఉన్నత పదవులను అధిరోహించిన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ను వదులుకొని మెరిట్తో విద్యను కొనసాగించిన వ్యక్తిగా ఆయన ప్రత్యేకతను వివరించారు.
డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన జగ్జీవన్ రామ్ ఆశాజ్యోతి అని కొనియాడారు. ఆయన ఆశయాలు నెరవేరాలంటే దళితులు ఉన్నత విద్య సాధించి, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత ప్రభుత్వం బడుగు వర్గాల కోసం అనేక సంక్షేమ, ఆర్థిక పథకాలు అమలు చేస్తున్నదని, వాటిని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. దళితులు వ్యాపార రంగంలో ఎదగడానికి బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు తనవంతు సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఎస్సి సబ్ప్లాన్ అమలుకు తోడ్పడిన తెలుగుదేశం పార్టీని మర్చిపోకూడదని, దళితులు ఏకమై తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. త్వరలో కల్యాణ మండపం నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.
నియోజకవర్గంలో పేదలకు ఎలాంటి సమస్య వచ్చినా పెద్దపాలేరులా సేవలు అందిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.