మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్!
ప్రకాశం జిల్లా మార్కాపురంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం బట్టబయలైంది. మార్కాపురం పట్టణంలోని చౌక దుకాణం నెం.6లో భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం అందడంతో రెవిన్యూ అధికారులు ఆకస్మికంగా దుకాణంపై దాడులు నిర్వహించారు. తనిఖీల్లో మొత్తం 1922 కేజీల రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచినట్లు బయటపడింది.
అధికారుల విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సంబంధిత దుకాణంపై 6A కేసు నమోదు చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అంతేకాకుండా చౌక దుకాణాన్ని కూడా అధికారులు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ఈ తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ సాలమ్మతో పాటు గ్రామ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.