మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు?
మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? టిడిపి కార్యాలయానికి కేటాయింపుపై జేడీ రామాంజనేయులు సంచలన వ్యాఖ్యలు!
రైతులకు అవసరం లేనందున టిడిపి కార్యాలయానికి స్థలం కేటాయింపు... మార్కెట్ యార్డ్ చైర్మన్..
నంద్యాల నూనెపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ స్థల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు జిల్లాలో రాజకీయ దుమారం రేపుతోంది. రైతుల కోసం వినియోగించాల్సిన అత్యంత విలువైన మార్కెట్ యార్డ్ స్థలాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించాలనే ప్రతిపాదనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు కోరిన మేరకు, నూనెపల్లి మార్కెట్ యార్డులో రెండు ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రక్రియలో భాగంగా, శనివారం వ్యవసాయ మార్కెట్ జాయింట్ డైరెక్టర్ (JD) రామాంజనేయులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబుతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న నిర్మాణాల తొలగింపు, స్థలం విలువ తదితర అంశాలపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పిస్తామని ఈ సందర్భంగా జేడీ వెల్లడించారు.
ఈ సందర్భంగా విలేకరులు జేడీ రామాంజనేయులును సూటిగా ప్రశ్నించారు. "రైతుల అభివృద్ధికి కేటాయించాల్సిన విలువైన భూమిని ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారు? దీనిపై రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలకు మీ సమాధానం ఏమిటి?" అని అడిగిన ప్రశ్నకు జేడీ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు.
జేడీ రామాంజనేయులు మాటల్లో..
"ప్రస్తుతం నూనెపల్లి మార్కెట్ యార్డ్లోని సదరు స్థలం రైతులకు పెద్దగా ఉపయోగపడటం లేదు. అందుకే దానిని లీజు ప్రాతిపదికన టిడిపి కార్యాలయానికి కేటాయించేందుకు నివేదికలు పంపుతున్నాం. అయితే రైతులకు అవసరమైన మిగిలిన స్థలాన్ని వారి కోసమే వినియోగిస్తాం."
రైతుల అవసరాల కోసం నిర్మించిన మార్కెట్ యార్డ్లో స్థలం "అనవసరం" అని ప్రభుత్వ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. భవిష్యత్తులో మార్కెట్ విస్తరణకు ఉపయోగపడే స్థలాన్ని రాజకీయ కార్యాలయాలకు ధారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసమని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.