మే 17 నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కొద్ది రోజులు పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
హిందూ ధర్మశాస్త్రంలో అత్యంత పవిత్రంగా భావించే అధిక మాసం ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఇది అధిక జ్యేష్ఠ మాసంగా వస్తోంది. ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలను సాధారణంగా నిర్వహించరు. దీంతో కొద్ది రోజుల పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు విరామం లభించనుంది.
శాస్త్రాల ప్రకారం సౌరమానం, చాంద్రమానం మధ్య ఉండే రోజుల తేడాను సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి అదనంగా వచ్చే నెలనే అధిక మాసం అంటారు. ఏ చాంద్రమాసంలో సూర్య సంక్రమణం జరగదో ఆ మాసం అధిక మాసంగా నిర్ణయిస్తారు.
పురాణాల ప్రకారం ఈ మాసానికి శ్రీమహావిష్ణువు తన ‘పురుషోత్తమ’ నామాన్ని ప్రసాదించడంతో దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. అందుకే ఈ నెలలో విష్ణుమూర్తి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.
ఈ మాసంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు, గాయత్రీ మంత్ర జపం, నామస్మరణలు నిర్వహిస్తారు. అలాగే పండ్లు, పిండి వంటలు, స్వయంపాక దానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో దానధర్మాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది.
పండితుల సూచనల ప్రకారం అధిక మాసంలో లౌకిక శుభకార్యాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక చింతనకు ఎక్కువ సమయం కేటాయించడం మంచిదని చెబుతున్నారు.