మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై GDAAP తీవ్ర ఖండన
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు వైద్య సిబ్బందిని సుమారు 10 గంటలపాటు నిర్బంధించి విచారించిన సంఘటనను గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (GDAAP) ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ యూనిట్ తీవ్రంగా ఖండించింది.
ఈ సందర్భంగా GDAAP ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ యూనిట్ అధ్యక్షులు డా. కె. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిపై ఈ విధమైన వ్యవహారం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బందిని గంటల తరబడి నిర్బంధించి విచారించడం వల్ల ఆసుపత్రి సేవలకు అంతరాయం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్య సిబ్బందికి తగిన గౌరవం, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డా. ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. వైద్య వృత్తిని గౌరవిస్తూ, వైద్య సిబ్బందికి అనుకూల వాతావరణం కల్పించడం అత్యంత అవసరమని GDAAP నాయకులు పేర్కొన్నారు.