తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ–ఎమ్మెల్యే వర్గపోరు.. రాజకీయంగా హాట్టాపిక్
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం: తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎంపీ వర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు చెరుకూరి రాజేశ్వరరావు ఇలాకా ఊటుకూరులో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమ శిలాఫలకంపై ఎమ్మెల్యే పేరు లేకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన ఎమ్మెల్యే పేరును తొలగించడంపై కొలికపూడి వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ–ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న విభేదాలు మున్ముందు ఎటువైపు దారితీస్తాయోనని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, మరోవైపు టీడీపీతో పాటు కూటమి నేతల మధ్య సమన్వయ లోపం పార్టీకి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జిల్లా పార్టీ అధ్యక్షుడు మారిన తర్వాత కూడా తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలను తగ్గించి సమన్వయం తీసుకురావడంలో ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని కింది స్థాయి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎంపీ–ఎమ్మెల్యే వర్గపోరు ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి రాజకీయంగా కలిసివచ్చే అవకాశం ఉందని, పార్టీని నమ్ముకున్న పలువురు క్రియాశీల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని తిరువూరు నియోజకవర్గంలో పరిస్థితులను చక్కదిద్దకపోతే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో నవంబరులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ సమీకరణాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.