మదనపల్లె జిల్లాలో ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక..
మదనపల్లె జిల్లాలో ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. 71 ఫిర్యాదుల స్వీకరణ
మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై మొత్తం 71 ఫిర్యాదులు అందాయి.
వాటిలో అత్యధికంగా భూ వివాదాలకు సంబంధించిన 30 ఫిర్యాదులు రాగా, ఆర్థిక లావాదేవీల సమస్యలపై 10, ఘర్షణలు, న్యూసెన్స్కు సంబంధించిన 10 ఫిర్యాదులు నమోదయ్యాయి. అలాగే మోసాలు, సైబర్ నేరాలకు సంబంధించి 7, కుటుంబ వివాదాలకు సంబంధించి 6, ఇతర సమస్యలపై 5, పరిపాలనా అంశాలకు సంబంధించి 3 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రజలు అందించిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ధీరజ్ పోలీసు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భూకబ్జాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు, మోసాలపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.