మడుపల్లి : ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలం మడుపల్లి గ్రామంలోని పి.ఎం.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాజోజు జ్ఞానేశ్వరాచారిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం చేతుల మీదుగా జ్ఞానేశ్వరాచారి ఖమ్మం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం మడుపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు తోట నరసింహారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. జ్ఞానేశ్వరాచారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు అన్ని విధాలా అర్హుడని పేర్కొన్నారు. పాఠశాల బోధనా విధులతో పాటు ఉపాధ్యాయ సేవకు సంబంధించిన వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలైన జనాభా గణన, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఎన్నికల నిర్వహణ వంటి విధుల్లో చురుకుగా పాల్గొన్నారని చెప్పారు.
అలాగే జిల్లా స్థాయి జీవశాస్త్ర వనరుల వ్యక్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ విద్యా రంగంలో తనదైన సేవలను అందిస్తున్నారని కొనియాడారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన అందించిన సేవలకు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ఎన్నికల అధికారులు అభినందనలు తెలిపిన సందర్భాలను గుర్తు చేశారు.
జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు జ్ఞానేశ్వరాచారిని ఎంపిక చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం, ప్రణాళిక సమన్వయకర్త సి.హెచ్. రామకృష్ణ, ఖమ్మం జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ప్రసర ప్రభాకర్ రెడ్డి, పీఆర్టీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్, ప్రధాన కార్యదర్శి ఆర్. రంగారావులకు పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం పాఠశాలకు, మడుపల్లి గ్రామానికి గర్వకారణమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని జ్ఞానేశ్వరాచారికి శుభాకాంక్షలు తెలిపారు.