మడుపల్లిలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
మడుపల్లిలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ – డబ్బా పాలకు దూరంగా ఉండాలని నిపుణుల సూచన
మధిర, ఆగస్టు 4:
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సెక్టార్ సూపర్వైజర్ జక్కుల నాగ సత్యవతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సీడీపీఓ కృష్ణశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కృష్ణశ్రీ మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి తల్లి తన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని, డబ్బా పాలపై ఆధారపడితే శిశువు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
వార్డ్ కౌన్సిలర్ నర్సిరెడ్డి మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాలే ఉత్తమ ఆహారమని, తల్లి–బిడ్డల ఆరోగ్య రక్షణకు తల్లిపాల వినియోగం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
డాక్టర్ పృద్వి మాట్లాడుతూ శిశువు పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలు పట్టించాలని, మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని సూచించారు. "డబ్బా పాలు వద్దు – తల్లిపాలు ముద్దు" అనే నినాదాన్ని ప్రతి కుటుంబం ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
అనంతరం చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్లు లక్ష్మీ తులసి, సునీత, డాక్టర్ సుష్మ, వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మి, సితార, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, రాధామాణిక్యం, శివకుమారి, మేరీకుమారి, ఆయాలు విజయతో పాటు గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.