మధిరలో టిడబ్ల్యూజేఎఫ్ పాదయాత్రకు ఘన స్వాగతం
మధిరలో టిడబ్ల్యూజేఎఫ్ పాదయాత్రకు ఘన స్వాగతం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు పోరాటం ఉధృతం
మధిర, ఆగస్టు 29: జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాల సాధన కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) చేపట్టిన పాదయాత్ర శనివారం మధిర పట్టణానికి చేరుకుంది. ఎర్రుపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు మధిర ప్రెస్ క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఖదీర్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో సాగిన పాదయాత్ర మధిర మార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. అక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో పాటు డాక్టర్ కొండలరావు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రామ్మోహన్రావు తదితరులు హాజరై జర్నలిస్టుల ఇళ్ల స్థలాల డిమాండ్కు సంపూర్ణ సంఘీభావం తెలిపారు.
అనంతరం పాదయాత్ర ప్రధాన రహదారి మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ తహసీల్దార్ రాంబాబుకు జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ముగింపు సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, వారి సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఖమ్మం జిల్లా టిడబ్ల్యూజేఎఫ్ నాయకులతో పాటు మధిర జర్నలిస్టులు జీవి, చల్లా నరసింహారెడ్డి, శ్రీధర్, అర్జున్, బాణాల రామకృష్ణ, వాసు, గోపి, మహంకాళి శ్రీనివాసరావు, పవన్, విజయభాస్కర్, సంతోష్, జయశీలుడు, దేవిశెట్టి కృష్ణ, కొండలరావు, కోటి తదితరులు పాల్గొన్నారు.