మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 10 వేల జీతం చెల్లించాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు రూ. 20 పెంచాల
సీఐటీయు జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి. కరీంబి డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ. 10 వేల జీతం చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయు) జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి. కరీంబి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం రోజున చెన్నూరు ప్రెస్ క్లబ్ లో ముఖ్యనాయకుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎండి. కరీంబి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్నం భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, వాటికి అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు ఇరవై రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే, విద్యార్థులకు అందించే కోడి గుడ్లను, వంట గ్యాస్ ను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. నిరుపేదలైన కార్మికులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు, ఐడి కార్డులు, యూనిఫామ్ లు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సారక్క, పోసవ్వ, మేకల సారక్క తదితరులు పాల్గొన్నారు.