సమాచార హక్కు చట్టాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలి: రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా. జి.చంద్రశేఖర్ రెడ్డి
మంచిర్యాల జిల్లాలో సమాచార హక్కు చట్టం-2005పై అధికారులకు విస్తృత అవగాహన సదస్సు.. పారదర్శకత, జవాబుదారీతనంతో పని చేయాలని ఆదేశం
మంచిర్యాల: ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టం ఒక శక్తివంతమైన సాధనమని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ శాఖలు అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా. జి.చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి. శ్రీనివాసరావు, మొహ్సినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య (స్థానిక సంస్థలు), వి.రాములు (రెవెన్యూ), బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ లతో కలిసి జిల్లా స్థాయి అధికారులకు సమాచార హక్కు చట్టం-2005 సమర్థవంతమైన అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలకు సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత అని తెలిపారు. చట్టం ప్రకారం దరఖాస్తు అందిన ముప్పై రోజులలోపు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని, ఒకవేళ గడువు దాటితే ఆ సమాచారాన్ని దరఖాస్తుదారునికి ఉచితంగా అందించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ప్రతి అధికారి చట్టంలోని నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, కమిషన్ ముందు అప్పీళ్ళ పరిష్కార సమయాల్లో ప్రజా సమాచార అధికారులు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని శాఖల ప్రథమ అప్పీళ్ల అధికారులకు, ప్రజా సమాచార అధికారులకు, సహాయ ప్రజా సమాచార అధికారులకు చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు, దరఖాస్తుల పరిష్కార కాలపరిమితులు, అప్పీళ్ల నిర్వహణ మరియు సమాచారాన్ని అందించడంలో పాటించాల్సిన విధివిధానాలపై కమిషన్ సభ్యులు విస్తృత అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ అందించిన సలహాలు, సూచనలను జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యం వీడి ప్రజలకు సత్వర సేవలు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అప్పీళ్ళ దరఖాస్తులను అధికారులు సుదీర్ఘంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, వివిధ శాఖల ప్రజా సమాచార అధికారులు, ప్రథమ అప్పీళ్ల అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు