పాత మంచిర్యాల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ నరేందర్ రాథోడ్ ఈరోజు పాత మంచిర్యాలలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని వసతులను, రికార్డులను పరిశీలించి వైద్యులు, సిబ్బందికి పలు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నందున వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలను, స్టాక్ రిజిస్టర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. రోజువారీగా మందుల ఖర్చు, వైద్య శిబిరాలకు పంపిణీ చేసిన వివరాలను రికార్డుల్లో పక్కాగా నమోదు చేయాలని, 'ఈ-ఔషధి' ద్వారా ఆన్లైన్లో మందుల నిల్వలను, ఎక్స్పైరీ తేదీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా వినియోగిస్తున్న ఐఎల్ఆర్ , డీప్ ఫ్రీజర్ల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గర్భవతులు, పిల్లలకు వ్యాక్సిన్ వేసే రోజున అన్ని రకాల వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచడంతో పాటు, ఆసుపత్రికి వచ్చే వారికి కూర్చోవడానికి తగిన సదుపాయాలు, త్రాగునీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గ్రామాల్లోని ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ఓ స్పష్టం చేశారు. 'స్టాప్ డయేరియా' కార్యక్రమంలో భాగంగా ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో తప్పనిసరిగా జింక్ మాత్రలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అలాగే, 14 ఏళ్లు నిండిన బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా నివారించే హెచ్పీవీ వ్యాక్సినేషన్ వేయించాలని, అందుబాటులో ఉన్న వివరాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. అనంతరం ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా అందుతున్న సేవలను పరిశీలించారు. పాత మంచిర్యాల యూపీహెచ్సీ వైద్య సిబ్బంది పనితీరు పట్ల, వారు అందిస్తున్న సేవల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ అశోక్, డాక్టర్ స్నేహిత, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్ మరియు ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు