మీ కోసంలో 52 ఫిర్యాదులు.. బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశాలు
మీ కోసంలో 52 ఫిర్యాదులు.. బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశాలు
మచిలీపట్నం: కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక "మీ కోసం" కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన బాధితులు తమ అర్జీలను సమర్పించగా, మొత్తం 52 ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఫిర్యాదుల్లో చల్లపల్లి ప్రాంతానికి చెందిన వృద్ధురాలు నర్సమ్మ తన కుమారులు తనను పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. పెనమలూరుకు చెందిన దిలీప్ తన స్నేహితుడికి అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మచిలీపట్నానికి చెందిన విద్య అనే వివాహిత తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను, తన పిల్లలను మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును చట్టపరంగా, నిష్పక్షపాతంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రజలకు ఎస్పీ సూచిస్తూ, సమస్యల పరిష్కారం కోసం జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న "మీ కోసం" కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కేవలం జిల్లా పోలీసు కార్యాలయంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదులు సమర్పించవచ్చని తెలిపారు.