మెగా పేరెంట్స్ డేతో విద్యాభివృద్ధికి కొత్త ఊపు తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్: మాదాసు చంద్రకళ
చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్దనవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీడీపీ సీనియర్ నేత మాదాసు చంద్రకళ మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అన్నారు.
ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతోందని పేర్కొన్నారు. మెగా పేరెంట్స్ డే వంటి కార్యక్రమాలు తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, హాజరు, క్రమశిక్షణ, ప్రతిభ గురించి నేరుగా తెలుసుకునే మంచి అవకాశమని చెప్పారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని భవిష్యత్తులో సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల విద్యపై నిరంతరం శ్రద్ధ చూపాలని, పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజపు నరసింహారావు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.