మహబూబాబాద్ మార్కెట్కు తాళం.. రైతుల ఆందోళన
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి ఎన్.ఎస్. ట్రేడర్స్ కొనుగోలు చేసిన మిర్చి, మొక్కజొన్న పంటలకు సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. "మా డబ్బులు మాకు ఇప్పించాలి" అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. ఎన్.ఎస్. ట్రేడర్స్ మార్కెట్ యార్డులోనే కాకుండా మార్కెట్ వెలుపల కూడా రైతుల నుంచి మిర్చి, మొక్కజొన్న కొనుగోలు చేసి మూడు నెలలు గడిచినా ఇప్పటికీ చెల్లింపులు చేయలేదన్నారు. రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ తమను తిప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయడానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.