మంచిర్యాల ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి: మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు
తరుగు పేరుతో బస్తాకు 3.5 కిలోల కోత.. క్వింటాల్కు రూ.100 నష్టం
మంచిర్యాల నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ తీవ్ర అవినీతి, నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్గా మారిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. లక్షెట్టిపేటలోని ఐబి గెస్ట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కలిసి రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. తరుగు పేరిట బస్తాకు 3.5 కిలోల చొప్పున కట్ చేస్తూ, క్వింటాలుకు 100 రూపాయల వరకు నష్టం కలిగిస్తున్నారని, ఈ రూపంలో వస్తున్న దాదాపు 25 కోట్ల రూపాయల అక్రమ సొమ్ము అంతా ఎమ్మెల్యే జేబులోకే వెళ్తోందని ధ్వజమెత్తారు.
దీనికి తోడు లారీ రవాణా పేరిట బస్తాకు 10 రూపాయలు, అన్లోడింగ్ కోసం మరో 7 రూపాయలు అక్రమంగా వసూలు చేయడం దుర్మార్గమన్నారు. జిల్లాలో పండిన ధాన్యంలో ఇప్పటివరకు సగం కూడా కొనలేదని, ఇంకా 40% కొనుగోళ్లు జరగాల్సి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వడ్లను సకాలంలో తరలించకపోవడం వల్ల వర్షానికి తడిసి ముద్దవుతున్నాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షెట్టిపేటలో నలుగురు రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొన్నామని గుర్తు చేస్తూ.. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఎమ్మెల్యే హైదరాబాద్, మంచిర్యాల సెటిల్మెంట్లు పక్కన పెట్టి, ఇక్కడి రైతుల కష్టాలు తీర్చాలన్నారు. ప్రభుత్వం, అధికారులు చేస్తున్న నిర్లక్ష్యంతో రైతులు నష్టపోవద్దని, వర్షాలకు తడిసిన పంటలను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, లక్షెట్టిపేట పట్టణంలో జరుగుతున్న ఆస్తుల కూల్చివేతలపై అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు. కొలతలు చట్టప్రకారం జరుగుతున్నాయా లేక ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తున్నారా అనేది కలెక్టర్ గారు తేల్చాలని, బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, నల్మాస్ కాంతయ్య, పొడేటీ శ్రీనివాస్, చుంచు చిన్నయ్య, తిప్పని లింగయ్య, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పెట్టం తిరుపతి, ఎక్కడి జмуనా-కుమార్, ఆసది పురుషోత్తం, అక్కల రవీందర్, రమణ తదితరులు పాల్గొన్నారు