మంచిర్యాల నియోజకవర్గంలో 'సర్' ప్రక్రియను వేగవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
మంచిర్యాల నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ అత్యంత నెమ్మదిగా సాగుతోందని, జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిఎల్ఓలు (BLO) జూలై 8వ తేదీ నాటికి 99 శాతం ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసినట్లు చెబుతున్న నివేదికలను అధికారులు మరోసారి పునఃసమీక్షించుకోవాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా దండేపల్లిలో 26.15 శాతం, లక్షెట్టిపేటలో 24.82 శాతం, హాజీపూర్లో 22.91 శాతం, మంచిర్యాలలో 3.54 శాతం, నస్పూర్లో కేవలం 2.89 శాతం చొప్పున.. మొత్తం నియోజకవర్గంలో కేవలం 11.89 శాతం మాత్రమే ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి సేకరించారని, ఇదే వేగంతో కొనసాగితే గడువులోగా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తికావడం అసాధ్యమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్యూమరేషన్ పత్రాలను ఓటర్లకు ఇచ్చిన తర్వాత వాటిని నింపేలా చూడాల్సిన బాధ్యత బిఎల్ఓలదేనని, 2002 ఓటర్ లిస్టులో ఉన్నవారి కుటుంబ సభ్యుల ఓట్లను కనుగొనే ప్రక్రియలో ప్రజలకు సరైన అవగాహన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దివాకర్ రావు పేర్కొన్నారు. కావున, ఏ విధంగానైతే పత్రాలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారో, అదే విధంగా బిఎల్ఓలే ప్రత్యేక చొరవ చూపి ఓటర్ల వద్దే దరఖాస్తులను నింపించి తిరిగి సేకరించేలా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గడువు ముగిసే నాటికి ప్రతి ఒక్కరి ఓటు నమోదు బాధ్యత జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారిపైనే ఉందని, ఈ ప్రక్రియ కోసం అదనపు బిఎల్ఓలను కేటాయించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఓటర్ మహాశయులందరూ ఈ ప్రత్యేక సమగ్ర సవరణకు సహకరించి, ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు