మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ: జూలై 18 వరకు అవగాహన వారోత్సవాలు
మంచిర్యాల, జూలై 11: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుండి శనివారం ఒక భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా కార్యక్రమ అధికారులు డాక్టర్ అరుణ శ్రీ, డాక్టర్ సుధాకర్ నాయక్, ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ శ్రీధర్ ఈ ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జూలై 11 నుండి 18వ తేదీ వరకు కుటుంబ సంక్షేమ, నియంత్రణ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం "పిల్లల మధ్య సరైన అంతరం ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా, ఆర్థికంగా బలోపేతం అవుతుంది" అనే నినాదంతో అర్హులైన దంపతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. 'చిన్న కుటుంబం - చింతలేని కుటుంబం' లక్ష్యంగా తల్లి, బిడ్డల ఆరోగ్యం కోసం మహిళలకు అందుబాటులో ఉన్న నోటి మాత్రలు, ఛాయా, ఈజీ పిల్స్, ఐయూసీడీ, అంతర ఇంజక్షన్ల వంటి తాత్కాలిక పద్ధతులతో పాటు, శాశ్వత పద్ధతులైన వ్యాసెక్టమీ, ట్యుబెక్టమీ సేవలపై ప్రజలకు వివరించాలని వైద్యాధికారులు సూచించారు.
ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఆశా మరియు ఆరోగ్య కార్యకర్తలు చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రకటనల బోర్డుల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జిల్లా వైద్యాధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార ప్రచార అధికారి వెంకటేశ్వర్, ప్రచార బృందం సభ్యులు అల్లాడి శ్రీనివాస్, ఎండి రషీద్, జిల్లా సబ్మిట్ అధికారి శ్రీనివాస్, సమాజ ఆరోగ్య అధికారులు నాందేవ్, కాకిరాల వెంకటేశ్వర్లు, పుట్ట సత్తయ్య, ఆర్.ఎస్ పద్మ పాల్గొన్నారు. అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ సంచాలకులు, అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది మరియు నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవగాహన ర్యాలీని విజయవంతం చేశారు