విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు యన్నం రంగారెడ్డికి ఘన నివాళి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల కన్నుమూసిన విశ్రాంత హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు యన్నం రంగారెడ్డి సంతాప సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
సభకు అధ్యక్షత వహించిన విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ, రంగారెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన బోధించిన విద్య, క్రమశిక్షణ, విలువలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. గ్రామ మాజీ సర్పంచి సంగెపు నారాయణ మాట్లాడుతూ, రంగారెడ్డి ఎంతోమంది విద్యార్థుల జీవితాలకు మార్గదర్శిగా నిలిచి వారిని ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నత ఉపాధ్యాయుడని కొనియాడారు.
మాజీ మధిర మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు కటకాల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, రంగారెడ్డి వద్ద చదువుకున్న అనేక మంది విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించి సమాజంలో మంచి స్థానం సంపాదించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, నిర్వహణ కమిటీ అధ్యక్షుడు తోట నాగరాజు, విశ్రాంత ఉపాధ్యాయుడు తొండెపు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు సంగెపు వెంకటేశ్వరరావు, సంగెపు రాంబాబు, సాయిబాబా కమిటీ ఆర్గనైజర్ సుగ్గల హనుమంతరావు, సంగెపు జమలయ్య, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.