దస్తావేజులు పెండింగ్లో ఉంచితే చెక్ స్లిప్ తప్పనిసరి
అమరావతి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏదైనా దస్తావేజును పెండింగ్లో ఉంచాల్సి వస్తే తప్పనిసరిగా లిఖితపూర్వకంగా చెక్ స్లిప్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చెక్ స్లిప్ ఇవ్వకుండా లేదా కార్డ్ 2.0లో నమోదు చేయకుండా అనధికారికంగా దస్తావేజులను పెండింగ్లో ఉంచితే దానిని తీవ్రమైన సేవా లోపంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.
సీఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధిక సంఖ్యలో దస్తావేజులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో పెండింగ్ విధానాన్ని రద్దు చేస్తూ, కాలపరిమితితో కూడిన కొత్త విధివిధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన రిజిస్ట్రేషన్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.