కాళేశ్వరంపై రాజకీయాలు వద్దు.. రైతులకు నీళ్లు అందించాలి: ఈటల రాజేందర్
హైదరాబాద్, జూలై 11: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఉత్తర తెలంగాణకు మిడ్ మానేరు కీలక నీటి జంక్షన్ అని పేర్కొన్న ఆయన, కరువు పరిస్థితులు ఎదురవుతాయని తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. లో-లెవల్ పాయింట్కు వచ్చిన నీటిని ఎందుకు ఎత్తిపోసడం లేదని ప్రశ్నించారు.
తాను తెలంగాణ మట్టిబిడ్డనని, ఉద్యమకారుడినని పేర్కొన్న ఈటల, తెలంగాణ ప్రయోజనాలే తనకు మొదటి ప్రాధాన్యమని అన్నారు. రాజకీయాల కోసం ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. తాను ఎవరి స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడే వ్యక్తిని కాదని, ప్రజా ప్రయోజనాల కోసమే ప్రశ్నిస్తున్నానని చెప్పారు.
దేవాదుల ప్రాజెక్టులో బ్యారేజ్ లేకుండానే నీటిని పంపింగ్ చేస్తున్నారని గుర్తుచేసిన ఆయన, మేడిగడ్డలో నీళ్లు నింపాలని కాకుండా ప్రస్తుతం ఉన్న నీటినే రైతులకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాల కారణంగా రైతులను ఇబ్బంది పెడితే సహించబోమని హెచ్చరించారు.
హైదరాబాద్ నగరానికి ఇప్పటికే రోజుకు 107 ఎంజీడీల మేర తాగునీటి కొరత ఉందని, భవిష్యత్తులో నీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు.