హరీశ్ కాంగ్రెస్లోకి వస్తానంటే చర్చిస్తాం: మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, జులై 11: బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్లో చేరాలనుకుంటే పార్టీ వేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
హరీశ్ రావు మూడు నెలలు నీటిపారుదల శాఖ బాధ్యతలు ఇస్తే రాష్ట్ర నీటి సమస్యను పరిష్కరిస్తానని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, పదేళ్లపాటు అధికారంలో ఉండి చేయని పనిని మూడు నెలల్లో ఎలా చేస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ తప్పిదాలు, అప్పులను సరిదిద్దే పనిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందని చెప్పారు.
హరీశ్ రావు నిజంగా కాంగ్రెస్లో చేరాలని కోరితే రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి పార్టీలో చేర్చుకోవాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలపై స్పందిస్తూ, భిన్నాభిప్రాయాలు సహజమని అన్నారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరిస్తామని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కూడా త్వరలో పరిష్కారమవుతుందని చెప్పారు.
ఇరు వర్గాల అభిప్రాయాలను విని తగిన నిర్ణయం తీసుకుంటామని, పార్టీలో అందరూ సమానమేనని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బిజీగా ఉండటంతో ఇద్దరు సీనియర్ నాయకులను సమస్య పరిష్కారం కోసం నియమించినట్లు తెలిపారు. సస్పెన్షన్ ఒక్కటే పరిష్కారం కాదని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని కూలదోస్తామని ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, తమ ప్రభుత్వానికి పది మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. రాష్ట్రంలో నీటి దోపిడీ జరిగిన సమయంలో ఈటల రాజేందర్ కూడా మంత్రిగా ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు.