ఓటు హక్కు పరిరక్షణే ధ్యేయం: క్షేత్రస్థాయిలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
బెల్లంపల్లి, జూలై 11 : ప్రజాస్వామ్యానికి ఓటే బలమని, ప్రతి అర్హుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండాలనే సంకల్పంతో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తాండూర్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. అక్కడ నిర్వహిస్తున్న ఎస్.ఐ.ఆర్ (SIR) ఓటర్ల సర్వేలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల ఇళ్లకు వెళ్లారు. ప్రజల వివరాలను అడిగి తెలుసుకుంటూ తన స్వహస్తాలతో ఎస్.ఐ.ఆర్ ఫారమ్లను నింపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనదని, ఒక్క అర్హుడి పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడడం మనందరి బాధ్యతన్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, న్యాయబద్ధంగా సాగాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం తాండూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను సందర్శించిన ఎంపీ వంశీకృష్ణ, అక్కడ జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో నివారణ చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రజల మధ్యే ఉంటూ వారి హక్కులు, ఆరోగ్య సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని, ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు