Breaking News
తాజా బ్రేకింగ్ వార్తలు ఇక్కడ అప్‌డేట్ చేయబడతాయి...
www.ntodaynews.com

మండు వేసవిలో చల్లని కబురు..

తెలంగాణ హైదరాబాద్
గడ్డం జగన్మోహన్ రెడ్డి
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026
22 వీక్షణలు

తెలంగాణలో ఆరు రోజుల పాటు వర్షాలు

మండు వేసవిలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో వచ్చే ఆరు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈనెల 21 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.

మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం మంగళవారం, బుధవారం నాటికి ఉత్తర తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు వర్షాలు విస్తరించే అవకాశముందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈనెల 21 వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొంత తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆదివారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పడిన ఈ వర్షాలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాయి.

ఎండలకు కాస్త బ్రేక్

ఈసారి తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండలు తీవ్రంగా మండడం ప్రారంభమైంది. మార్చి ప్రారంభానికి చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరుకున్నాయి.

ఉదయం ఎనిమిది గంటలకే సూర్యుడు మండిపోతుండగా, మధ్యాహ్నం సమయాల్లో నగరాలు, పట్టణాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉండగా రాత్రిపూట కూడా ఉక్కపోత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. దీంతో ప్రజలు ఏసీలు, కూలర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది.

ఇలాంటి సమయంలో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించడంతో ప్రజలకు కొంత ఊరట లభించినట్టయింది.