మర్లపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..
మర్లపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 8 మంది విద్యార్థులకు అస్వస్థత
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు.
విషయం గమనించిన ఉపాధ్యాయులు వెంటనే స్పందించి బాధిత విద్యార్థులను వేంసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, ఈ పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఆహార పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రారంభమైన తొలిరోజే ఈ ఘటన చోటుచేసుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ఆహార నాణ్యతపై అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.