మరోసారి క్షిపణుల మోత.. సౌదీ, ఖతార్లపై విరుచుకుపడ్డ ఇరాన్!
ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. దాదాపు 18 రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఏ దేశం కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయినా, కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినా కూడా పోరు మరింత తీవ్రతరమవుతోంది.
ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రతీకార దాడులను కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను కోల్పోయినప్పటికీ, యుద్ధంలో తన దూకుడు తగ్గించలేదు.
ఇటీవల ఖతర్ మరియు సౌదీ అరేబియా లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేపట్టింది. ముఖ్యంగా సౌదీ రాజధాని రియాద్ లో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. అయితే, సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులు నాలుగు క్షిపణులను అడ్డుకున్నామని వెల్లడించారు.
మరోవైపు ఖతర్లోని రస్ లఫాన్ రిఫైనరీ వద్ద క్షిపణి దాడుల ప్రభావంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఇదే సమయంలో, క్షిపణి శకలాలు పడడంతో ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం వద్ద కొన్ని ప్రైవేట్ విమానాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ఇప్పటికీ ఈ ఘటనలపై పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను గమనిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.