ముస్తఫావలీ ఆవులియా 61వ ఉరుసు మహోత్సవాలకు మంత్రి ఫరూక్కు ఆహ్వానం
ఈ నెల 27, 28 తేదీల్లో ఘనంగా ఉరుసు వేడుకలు
విజయవాడ:
ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం ముస్తాబాదాలోని హజరత్ సయ్యద్ ముస్తఫావలీ ఆవులియా 61వ ఉరుసు మహోత్సవాలు ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ ఉరుసు మహోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్కు దర్గా కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ బాబా, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూఖ్ షుబ్లీతో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఉరుసు వేడుకల వివరాలను వివరించారు.
ఈ సందర్భంగా సయ్యద్ నజీరుద్దీన్ బాబా ఉరుసు నిర్వహణ ఏర్పాట్లను మంత్రికి వివరించారు. ఆగస్టు 27వ తేదీ గురువారం రాత్రి 10 గంటలకు ముజావర్ల ఇంటి నుంచి ఉరుసు (సందల్) ఊరేగింపు ప్రారంభమై, ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఉదయం 4 గంటలకు దర్గాకు చేరుకుంటుందని తెలిపారు. అనంతరం మీలాద్ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్తఫా దర్గా ముజావర్లు చీమలపాడు వలియ్యుల్లాహ్ షాహ్ ముస్తఫా, మహిబుల్లా, మతిన్ మక్బూల్తో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.