నా కుమారుడు 100% తప్పు చేయలేదు
- కడప జిల్లా మైదుకూరు: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్పై వస్తున్న ఆరోపణలను ఆయన తండ్రి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం మైదుకూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ఘటనతో తమ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందన్నారు.
డిన్నర్ పార్టీకి వెళ్లిన తన కుమారుడు అక్కడ పరిస్థితులు గమనించి బయటకు వస్తుండగా పోలీసులు వచ్చి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారని తెలిపారు. పోలీసుల సమక్షంలో తీసుకున్న యూరిన్ శాంపిల్కు 10 నిమిషాల్లోనే నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని, మరికొంత మందికి మాత్రం పాజిటివ్ వచ్చిందని చెప్పారు.
అయితే తరువాత ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మళ్లీ యూరిన్ శాంపిల్స్ మాత్రమే తీసుకున్నారని, కానీ ఐదు గంటల తర్వాత బ్లడ్ రిపోర్ట్లో పాజిటివ్ వచ్చిందని ప్రకటించడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. “బ్లడ్ శాంపిల్ తీసుకోకుండానే బ్లడ్ రిపోర్ట్ ఎలా వచ్చింది?” అని ప్రశ్నించారు.
ఆరోగ్య పరిస్థితి వివరాలు తన కుమారుడికి 2021లో హార్ట్ సర్జరీ చేసి స్టెంట్ వేశారని, పల్స్ 120 దాటితే ప్రమాదమని డాక్టర్లు సూచించారని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటే పల్స్ 150–180 వరకు పెరుగుతుందని, కానీ పరీక్షల సమయంలో 97 మాత్రమే ఉందని చెప్పారు.
మందుల ప్రభావం వల్లే ఫలితాలు? పోలీసులు పేర్కొన్న అంఫెటమైన్ తరహా ఆనవాళ్లు, కొన్ని హార్ట్ లేదా షుగర్ మందుల వల్ల కూడా రావచ్చని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్స్ హైదరాబాద్, ఢిల్లీ ప్రముఖ ల్యాబ్లలో, అలాగే ఢిల్లీలోని AIIMS ఆసుపత్రిలో స్వయంగా పరీక్షలు చేయించగా అన్ని రిపోర్టుల్లో “నెగెటివ్” వచ్చాయని వెల్లడించారు.
పోలీసు విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు ఆధారాలతో వెల్లడిస్తామని, తన కుమారుడు నిరపరాధి అని నిరూపించుకుంటారని సుధాకర్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసుకు కూడా ఎంపీ వివరణ ఇచ్చినట్లు తెలిపారు.