నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి : చెరువుగట్టులో విషాదం
నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి : చెరువుగట్టులో విషాదం
ఆడుకుంటూ వెళ్లిన రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన తీవ్ర విషాదకర సంఘటన నల్గొండ జిల్లా చెరువుగట్టు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పునారం నిహారే (28) తాపీ మేస్త్రీగా పనిచేస్తూ, గత ఐదేళ్లుగా కుటుంబంతో సహా నార్కట్పల్లిలో నివాసముంటున్నాడు. శుక్రవారం నాడు నిహారే తన భార్య సరిత, చిన్న కుమారుడు మోహిత్ తో కలిసి చెరువుగట్టు గ్రామంలోని కప్పే శ్రీశైలం నివాసంలో తాపీ పని చేయడానికి వెళ్లాడు. మధ్యాహ్నం సుమారు 12:45 గంటల ప్రాంతంలో దంపతులిద్దరూ పనిలో నిమగ్నమై ఉండగా, ఆడుకుంటున్న చిన్నారి మోహిత్ ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న నీటి సంపులో పడిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని బయటకు తీసినప్పటికీ, అప్పటికే చిన్నారి మృతి చెంది ఉన్నాడు. ఈ ప్రమాదంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని బాలుడి తండ్రి పునారం నిహారే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి ఎస్సై పి విష్ణుమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.