నెమలి గ్రామంలో పోలీసుల పల్లె నిద్ర....
నెమలి గ్రామంలో పోలీసుల ‘పల్లె నిద్ర’.. ఎన్నికల వేళ శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
గంపలగూడెం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ మార్గదర్శకత్వంలో మైలవరం ఏసీపీ రామచంద్రరావు, తిరువూరు సీఐ జి. గురుప్రకాష్, గంపలగూడెం ఎస్సై జి. అనిల్ సిబ్బందితో కలిసి గ్రామంలో రాత్రి బస చేశారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలోని సున్నిత ప్రాంతాలను పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామస్తులతో ముఖాముఖిగా మాట్లాడి భద్రతా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు గురికాకుండా ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
సైబర్ మోసాలపై అవగాహన
‘ఖాకీ స్టూడియో’ వీడియో ప్రదర్శన ద్వారా సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అపరిచితుల నుంచి వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్, అనుమానాస్పద లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
యువతపై ప్రత్యేక దృష్టి
గ్రామంలోని యువత గంజాయి, బెట్టింగ్లు, అతివేగ వాహనాల నడపడం వంటి వ్యసనాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులు సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడటమే పోలీసుల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రజల రక్షణకు పోలీసులు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. పోలీసులు స్వయంగా గ్రామంలో రాత్రి బస చేసి ప్రజల సమస్యలను తెలుసుకోవడం పట్ల నెమలి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.