నినాదాలు చేస్తే కేసులా?.. బాంబే హైకోర్టు ఆగ్రహం
ముంబై, జూలై 4: బీజేపీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తిపై నమోదు చేసిన కేసును బాంబే హైకోర్టు కొట్టివేసింది. రాజకీయ నినాదాలు చేసినందుకు ఒక వ్యక్తిపై పోలీసులు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ మాధవ్ జామ్దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం నేరం కాదని స్పష్టం చేశారు. ప్రజల నిరసనలను అణచివేయడానికి వరుసగా కేసులు నమోదు చేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
"ప్రజలు ప్రశ్నలు అడగడం నేరం కాదు. అది ప్రతి పౌరుడి బాధ్యత. పౌరులందరినీ ప్రభుత్వానికి బానిసలుగా మారుస్తున్నారా? నినాదాలు చేస్తే కేసులు పెడతారా?" అంటూ పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.
విద్యార్థుల ఆత్మహత్యలు, నీట్ పరీక్షలో అక్రమాలు వంటి కీలక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అధికార యంత్రాంగం, రాజకీయ నినాదాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఆందోళనకరమని జస్టిస్ మాధవ్ జామ్దార్ వ్యాఖ్యానించారు.
నిరసన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును అణచివేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసిన హైకోర్టు, సంబంధిత కేసుతో పాటు బహిష్కరణ ఉత్తర్వులను కూడా రద్దు చేసింది.