నకిలీ మందుల చెక్.. క్యూఆర్ కోడ్ తప్పనిసరి
న్యూఢిల్లీ | NToday News
దేశంలో నకిలీ మందుల విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులు, యాంటీమైక్రోబియల్ ఔషధాలు, నార్కోటిక్ ఔషధాల ప్యాకేజింగ్పై QR కోడ్ లేదా బార్కోడ్ తప్పనిసరి చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నిర్ణయంతో ఔషధాల తయారీ సంస్థ, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను సులభంగా గుర్తించి ట్రాక్ చేసే అవకాశం కలుగుతుంది. దీంతో నకిలీ మందుల సరఫరాను నియంత్రించడంతో పాటు, వినియోగదారులకు అసలైన మందులను గుర్తించడం మరింత సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, వ్యాక్సిన్లు మరియు క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులపై 2027 జూలై 1 నుంచి, యాంటీమైక్రోబియల్ ఔషధాలపై 2028 జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఔషధాల నాణ్యత, పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.