నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు… 69 మందికి ఝలక్
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు… 69 మందికి ఝలక్
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో నకిలీ ధ్రువపత్రాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను నకిలీ సర్టిఫికెట్లతో పొందిన 69 మందిపై శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఐటీఐ (ఎలక్ట్రిషియన్) అర్హత లేకపోయినా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు విచారణలో స్పష్టమైంది.
ఈ వ్యవహారంపై స్పందించిన సీఎండీ శివశంకర్ లోతేటి, నిందితులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నోటీసులు పంపించినట్లు సమాచారం.
జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 38 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో 16 మంది, తిరుపతిలో 3 మంది, చిత్తూరులో 4 మంది, నెల్లూరులో 4 మంది, అనంతపురంలో 3 మంది, అన్నమయ్య జిల్లాలో ఒకరు ఉన్నారు.
ఈ ఘటనతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో జరుగుతున్న అక్రమాలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే కఠిన పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.