పార్టీకి కార్యకర్తలే కొండంత అండ: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
నకిరేకల్, జూన్ 19: నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలోని సువర్ణ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని వివిధ బూత్ల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, అలాగే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ నమోదు లక్ష్యాలను వివరించారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త గులాబీ జెండా బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని పేర్కొన్న ఆయన, బూత్ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయడం ద్వారా రాబోయే రాజకీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్, నకిరేకల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్చార్జి గుజ్జ దీపికా-యోగేంద్ర, మాజీ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.