నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!!
నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!!
ప్రెస్ క్లబ్ హామీలు గాలిలోనా..?? జిల్లాలో ముదురుతున్న జర్నలిస్టుల ఆగ్రహం..!!
నంద్యాల పట్టణంలో స్థలాల కేటాయింపుల వ్యవహారం రాజకీయంగా మళ్లీ వేడెక్కింది.నంద్యాల నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన 10 సెంట్ల స్థలాన్ని ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్)కు కేటాయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.పద్మావతి నగర్ ప్రాంతంలో సెంటు స్థలం కోటి రూపాయలు పలుకుతుండగా,ఈ భూమి విలువ సుమారు రూ.10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా..!!
పట్టణంలో సుమారు 500 మందికి పైగా వైద్యులు ప్రైవేట్ రంగంలో సేవలు అందిస్తున్నారు.వీరిలో కొందరు పెద్ద నర్సింగ్ హోంలు నిర్వహిస్తుండగా, మరికొందరు క్లినిక్ లు నడుపుతూ లక్షల నుంచి కోట్ల వరకు ఆదాయం పొందుతున్నారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో సమావేశాల కోసం భవనం నిర్మించుకునేందుకు ఇప్పటికే ఆర్థికంగా బలమైన వర్గానికి చెందిన ఐఎంఏకు ప్రభుత్వ భూమి కేటాయించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు జిల్లాలో వినిపిస్తున్నాయి..!!
ఈ నిర్ణయంపై జర్నలిస్టు సంఘాలు,ప్రజా సంఘాలు,వామ పక్ష పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నాయి.ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియా వర్గాలకు మాత్రం ఇప్పటికీ స్థలం కేటాయించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.నంద్యాలలో ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని జర్నలిస్టు సంఘాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ,ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు..!!
జిల్లాలో ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని పాత్రికేయులు నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ,ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లా కేంద్రంగా ఉన్న నంద్యాలలో పాత్రికేయుల కోసం ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు..!!
కాంగ్రెస్,టీడీపీ,వైసీపీ--ఏ పార్టీ అధికారంలో ఉన్నా జర్నలిస్టుల విన్నపాలు మాత్రం ఫలితం చూడలేదన్న విమర్శలు జిల్లాలో వెల్లువెత్తుతున్నాయి..!!
గతంలో అనగా 2009 సం "లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఉదార స్వభావంతో కొంతమంది సీనియర్ పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది.ఆ నిర్ణయాన్ని జర్నలిస్టులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు పాత్రికేయులకు త్రిబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది..!!
అలాగే 2024 సాధారణ ఎన్నికల్లో నంద్యాల నియోజక వర్గ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డీ ఫరూక్ జర్నలిస్టులకు వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రకటించిన విషయం గుర్తు చేస్తున్నారు.కానీ ఇప్పుడు మాత్రం డిడ్కో ఇళ్లను పాత్రికేయులకు కేటాయిస్తామని,అర్హులైన వారు అప్లై చేసుకోవాలని చెప్పడం పట్ల జర్నలిస్టు వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి..!!
ఎన్నికల ముందు ఒక మాట..ఇప్పుడు మరో మాట ఎందుకు..?? అని పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారు.ప్రెస్ క్లబ్కు స్థలం కేటాయించకపోవడం,ఇళ్ల హామీలు కూడా అమలు కాకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం దెబ్బతింటోందని అంటున్నారు..!!
ఇక తాజాగా ఐఎంఏకు 10 సెంట్ల స్థలం కేటాయింపుపై జర్నలిస్టు సంఘాలు కలిసికట్టుగా,యూనియన్లకు అతీతంగా పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం..పేదల పక్షాన పోరాడే మీడియాకు కనీస సదుపాయం కల్పించకుండా,ఇప్పటికే బలమైన వర్గాలకు కోట్ల విలువైన భూములు కేటాయించడం అన్యాయమని వారు ఆరోపిస్తున్నారు..!!
ఇదే సమయంలో,రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న ఐఎంఏపై ఉన్న ఆరోపణలు కూడా ఈ వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మారుస్తున్నాయి..!!
ప్రభుత్వ భూములు నిజంగా పేదల సంక్షేమం కోసమా..?? లేక ప్రభావశీల వర్గాల కోసమా..?? అన్న ప్రశ్నలు నంద్యాల జిల్లాలో గట్టిగా వినిపిస్తున్నాయి..!!
కోట్ల విలువైన భూమి ఐఎంఏకు..కానీ ప్రజల స్వరం వినిపించే ప్రెస్ క్లబ్కు స్థలం ఎప్పుడూ..?? -- అనేది ఇప్పుడు నంద్యాల ప్రజలు,జర్నలిస్టు వర్గాలు,ప్రజా సంఘాలు మరియు వామ పక్ష పార్టీ నేతలు అడుగుతున్న ప్రధాన ప్రశ్న..??