నూజివీడు ఏరియా ఆసుపత్రికి ఎలక్ట్రికల్ బెడ్, వీల్చైర్ వితరణ
నూజివీడు ఏరియా ఆసుపత్రికి ఎలక్ట్రికల్ బెడ్, వీల్చైర్ వితరణ
రోగుల సౌకర్యాల కోసం కొలుసు పెద్ద రెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమం
(ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, నూజివీడు)
నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటానని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఇచ్చిన హామీ మేరకు నూజివీడు ఏరియా ఆసుపత్రికి ఎలక్ట్రికల్ బెడ్, ఎలక్ట్రికల్ వీల్చైర్ను వితరణగా అందించారు.
మంత్రి కొలుసు పార్థసారథి తండ్రి, మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యుడు స్వర్గీయ కొలుసు పెద్ద రెడ్డయ్య పేరుతో ఏర్పాటు చేసిన కొలుసు పెద్ద రెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో సుమారు రూ.లక్ష విలువైన ఎలక్ట్రికల్ బెడ్, ఎలక్ట్రికల్ వీల్చైర్ను ఆసుపత్రికి అందజేశారు. వీటిని నూజివీడు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మజ స్వీకరించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులోనూ ఆసుపత్రి అభివృద్ధికి, ప్రజా సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం కొనసాగిస్తామని తెలిపారు.
ఆసుపత్రికి ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో రోగులకు, వారి సహాయకులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందనున్నాయి.