నస్పూర్ లో వైభవంగా వారాహి నవరాత్రులు
నస్పూర్ లో వైభవంగా వారాహి నవరాత్రులు: హోమంలో పాల్గొన్న మేయర్ దంపతులు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ కాలనీలో గల శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గా దేవి దేవాలయంలో శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక హోమంలో మున్సిపల్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ - సుజాత దంపతులు, సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం. శ్రీనివాస్ దంపతులు హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, యాగశాలలో జరిగిన హోమంలో పూర్ణాహుతి సమర్పించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ వారాహి అమ్మవారిని వారు ప్రార్థించారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు మేయర్, జీఎం దంపతులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మరియు విశేష సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు