భారత్ రక్తదాన్ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిస్సి
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని పీఎస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం భారత్ రక్తదాన్ సేవా మిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు చెందిన రక్తదాతలు, సామాజిక సేవకులను ఈ సందర్భంగా సన్మానించారు.
కార్యక్రమంలో 320 సార్లు రక్తదానం చేసిన సంపత్ కుమార్తో పాటు సంస్థ వ్యవస్థాపకులు కురిమేటి నవీన్, సర్వే నీడ్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిస్సి భారత్ రక్తదాన్ ఉత్తమ సేవా పురస్కారం–2026 అందుకున్నారు.
మధిర పట్టణంలో మధిర రెస్క్యూ టీమ్ను స్థాపించి నిస్సి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రులకు తరలించడం, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతల సహకారంతో రక్తాన్ని అందించడం, అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం వంటి సేవలను కొనసాగిస్తున్నారు.
అలాగే వివిధ ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి పేదలకు అందించడం, పాత దుస్తులను సేకరించి అడవి ప్రాంతాల్లో నివసించే వారికి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ముఖ్యంగా ఆదరణ సేవా వృద్ధుల ఆశ్రమాన్ని స్థాపించి వృద్ధులకు వసతి కల్పిస్తూ సేవలు అందిస్తున్నారు.
సామాజిక సేవ, రక్తదాన సేవలు, అత్యవసర సహాయక చర్యలు, వృద్ధుల సంక్షేమం తదితర రంగాల్లో అందిస్తున్న సేవలను గుర్తించి నిస్సికి ఈ పురస్కారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. పురస్కారం అందించిన కే. నవీన్, కమిటీ సభ్యులు, భారత్ రక్తదాన్ సేవా మిషన్ అసోసియేషన్కు ఆదరణ ఫౌండేషన్ తరఫున నిస్సి కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న నిస్సిని పలువురు అభినందించారు.