ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్ కేసు.. ఎస్ఐ, జర్నలిస్టు సహా నలుగురు అరెస్ట్
రూ.50 లక్షల వసూళ్లకు కుట్ర.. తుపాకీతో బెదిరించి హోటల్లో నిర్బంధం
ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్ ఘటన సంచలనం సృష్టించింది. బొలాంగీర్కు చెందిన హోటల్ వ్యాపారి నరేంద్ర సాహును అపహరించిన కేసులో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, జర్నలిస్టుతో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారిని బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కిడ్నాప్కు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 14న నరేంద్ర సాహును తుపాకీతో బెదిరించిన నిందితులు బొలాంగీర్ నుంచి భువనేశ్వర్కు తీసుకెళ్లారు. అక్కడ ఓ హోటల్లో నిర్బంధించి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నరేంద్ర సాహు మరో వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు నకిలీ వీడియో సృష్టించి, దానిని చూపించి బ్లాక్మెయిల్ చేయాలనే కుట్ర చేసినట్లు వెల్లడించారు.
నరేంద్ర సాహు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, ఆయనను తరలించిన వాహనం భువనేశ్వర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి.
ఈ కేసులో క్షితీష్ చంద్ర సాహు, సంజీవ్ బెహెరా ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షితీష్ సోదరి స్నేహమంజరి సాహు ఖండగిరి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండగా, ఆమె కూడా ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
అలాగే భువనేశ్వర్కు చెందిన జర్నలిస్టు సంజయ్ జెనా పోలీస్ అధికారిగా నటిస్తూ నరేంద్ర సాహును ఖండగిరి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. కేసులో మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.