ఓల్డ్ సిటీ 'గోల్డ్ మ్యాన్' సూర్యాభాయ్ అరెస్ట్.. తక్కువ ధరకు బంగారం పేరుతో లక్షల రూపాయల మోసం!
హైదరాబాద్లో తక్కువ ధరకు స్వచ్ఛమైన బంగారం ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓల్డ్ సిటీకి చెందిన 'గోల్డ్ మ్యాన్' సూర్యాభాయ్ను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, సూర్యాభాయ్ తనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడినని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ పలువురిలో నమ్మకం కల్పించినట్లు తెలుస్తోంది. అలాగే ఒళ్లంతా బంగారు ఆభరణాలు ధరించి 'గోల్డ్ మ్యాన్'గా ప్రచారం చేసుకుంటూ, మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే స్వచ్ఛమైన బంగారం అందిస్తానని చెప్పి బాధితుల నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే డబ్బులు తీసుకున్న తర్వాత నెలలు గడిచినా బంగారం ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీయగా, వారినే బెదిరించినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సూర్యాభాయ్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో మరికొందరు బాధితులు ఉన్నారా? డబ్బుల లావాదేవీలు ఎంత మేర జరిగాయి? అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.