ఓటర్ల జాబితాలో పేర్లు సరిచూసుకోవాలి
ఓటర్ల జాబితాలో పేర్లు సరిచూసుకోవాలి
ఓటర్ల జాబితాలో తమ పేర్లు సరిగా ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని, రెండో దశ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత పత్రాలను బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్ఓ) అందజేసి తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని బీఎల్ఏల ఇన్చార్జి పల్లపు బుద్ధుడు సూచించారు. చిట్యాల మండలంలోని ఉరుమడ్ల, తాళ్లవెల్లంల గ్రామాల్లో గురువారం నిర్వహించిన ఓటర్ల జాబితా రెండో దశ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కోరారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, రెసిడెన్షియల్ సర్టిఫికెట్తో పాటు చదువుకున్న వారు తమ విద్యార్హతల సర్టిఫికెట్లను అవసరమైన మేరకు జత చేసి బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉరుమడ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి భానుశ్రీ భిక్షం, తాళ్లవెల్లంల గ్రామపంచాయతీ సర్పంచ్ జోగు సురేష్ పాల్గొని, నోటీసులు అందుకున్న ప్రతి ఓటరూ నిర్ణీత ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. చిట్యాల మండలంలో 100 శాతం ఓటర్ల నమోదు లక్ష్యాన్ని సాధించేందుకు బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పరస్పరం సహకరించాలని పల్లపు బుద్ధుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్ఓలు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.