ఊటుకూరు రామాలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు
గంపలగూడెం: పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని మండలంలోని ఊటుకూరు శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన పునర్వసు సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, నూతన వస్త్రాలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. అనంతరం తులసి దళాలు, వివిధ రకాల పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మేడూరు శివాలయాల్లో రుద్రాభిషేకాలు
సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని గంపలగూడెం మండలంలోని మేడూరు 1116 శివలింగాల ఆలయంతో పాటు పాత శివాలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శివలింగాలకు రుద్రాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుని దర్శించుకుని పూజలు నిర్వహించారు.