పద్మశ్రీ ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా ఘన నివాళులు
డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు
ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్) వై. ప్రసాద్ రావు ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1915 జూలై 26న గుంటూరు జిల్లా అమృతలూరు మండలం చుండూరు గ్రామంలో జన్మించిన ప్రగడ కోటయ్య మహాత్మా గాంధీ పిలుపుతో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో విశేష పాత్ర పోషించారని తెలిపారు.
స్వాతంత్ర్యం అనంతరం అణగారిన వర్గాల అభ్యున్నతికి, ముఖ్యంగా చేనేత కార్మికుల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. దేశవ్యాప్తంగా చేనేత కార్మికుల హక్కుల పరిరక్షణ, సహకార సంఘాల ఏర్పాటు, చేనేత రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి "చేనేత బంధువు"గా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
అఖిల భారత చేనేత కాంగ్రెస్ నాయకుడిగా చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి అనేక సంక్షేమ చర్యలకు మార్గం సుగమం చేశారని, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. సమాజానికి, చేనేత రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని గుర్తు చేశారు.
ప్రగడ కోటయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ముఖ్యమైన సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
జయంతి సందర్భంగా అదనపు ఎస్పీ వై. ప్రసాద్ రావు పోలీసు సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ సతీష్ కుమార్, పోలీసు ప్రధాన కార్యాలయ పరిపాలన అధికారి షేక్ మస్తాన్, ప్రధాన కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.