పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి
పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి
వెల్గటూర్, ఏప్రిల్ 26:
జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంధువుల పెళ్లి వేడుకకు వెళ్లి సరదాగా గడుపుదామనుకున్న ఓ బాలుడిని మృత్యువు బావి రూపంలో కబళించింది. ఈతకు వెళ్లిన 13 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన గొల్లపల్లి, బుగ్గరం మండలాల్లో కలకలం రేపింది.
సంఘటన వివరాలిలా ఉన్నాయి..
బుగ్గరం మండలం బీర్సని గ్రామానికి చెందిన కాంపెల్లి రితేష్ (13) అనే బాలుడు, ఆదివారం గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలో జరుగుతున్న బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యాడు. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు రితేష్ సమీపంలోని వ్యవసాయ బావిలోకి ఈతకు వెళ్లాడు.
అయితే, బావిలో నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ఈత రాక రితేష్ నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతి చెందాడు.
గ్రామంలో మిన్నంటిన రోదనలు
కళ్లముందే ఆడుతూ పాడుతూ తిరిగిన బాలుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లి సంబరాల్లో ఉన్న బంధువుల ఇళ్లలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. బీర్సని గ్రామం రితేష్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నారు