పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్
పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్
- బ్యాంకర్లు, అధికారులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
- నస్పూర్ కలెక్టరేట్లో 'పీఎంఎఫ్ఎంఈ' సింగిల్ విండో డ్రైవ్
నస్పూర్ (మంచిర్యాల): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార తయారీ సంస్థల ఫార్మలైజేషన్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం కింద బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను, బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో నిర్వహించిన పీఎంఎఫ్ఎంఈ 'సింగిల్ విండో డ్రైవ్' కార్యక్రమానికి ఆయన అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, డీఆర్డీఓ కిషన్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, పరిశ్రమల కేంద్రం జీఎం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకుల వారీగా జిల్లా స్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు.
సూక్ష్మ ఆహార తయారీ రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువ పారిశ్రామికవేత్తలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. స్థానికంగా లభించే వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకు విలువను జోడించి, నాణ్యమైన ఆహార ఉత్పత్తులుగా మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని మహిళా సంఘాల సభ్యులు, అర్హులైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
పథకం అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను సింగిల్ విండో విధానంలో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. అధికారులు ఎలాంటి సాంకేతిక లోపాలు లేని సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) బ్యాంకులకు సమర్పించాలని, బ్యాంకర్లు వాటిని ప్రాధాన్యతగా తీసుకొని సకాలంలో రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. యూనిట్ల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయడానికి బ్యాంకులు, సెర్ప్, పరిశ్రమల శాఖ, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ డి.అంజయ్య, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అధికారులు, బ్యాంకర్లు, సెర్ప్, మెప్మా సిబ్బంది, పీఎంఎఫ్ఎంఈ లబ్ధిదారులు పాల్గొన్నారు