పెనుగొలనులో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి దాశరథి 101వ జయంతి వేడుకలు ఘనంగా
పెనుగొలనులో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి దాశరథి 101వ జయంతి వేడుకలు ఘనంగా
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శాఖా గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్యులు 101వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. దాశరథి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దాశరథి కృష్ణమాచార్యులు 1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరు మండలం మర్రిపాడులో జన్మించారని తెలిపారు. తెలుగు సాహిత్యంలో ఖండకావ్యాలు, కథలు, నాటికలు, కవితలు, గేయాలు, సినీగీతాలు, అనువాదాలు వంటి అనేక ప్రక్రియల్లో విశిష్ట సేవలందించారని కొనియాడారు.
కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా మలుచుకుని ప్రజల్లో చైతన్యం నింపిన మహాకవి దాశరథి అని పేర్కొన్నారు. 1977 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆస్థాన కవిగా సేవలందించారని గుర్తు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, కళా ప్రపూర్ణ, కవి సింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి, ఆంధ్ర కవితా సారధి వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, బిరుదులు ఆయనకు లభించాయని వివరించారు.
కార్యక్రమంలో నామా రవి, ఆళ్ళ మురళి, శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని దాశరథికి ఘనంగా నివాళులర్పించారు.